Breaking News

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మంటల్లో ఆవిరైన ప్రాణాలు!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మంటల్లో ఆవిరైన ప్రాణాలు!


Published on: 24 Oct 2025 09:07  IST

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారింది. ఉలిందకొండ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే మొత్తం బస్సును ఆవరించాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో సుమారు 56 మంది ప్రయాణికులు ఉన్నారు. చిన్నటేకూరు సమీపంలో బస్సు ఒక బైకును ఢీకొట్టడంతో ఇంధన ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

మంటలు విపరీతంగా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన 12 మంది బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే మిగిలిన పలువురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో బయటపడే అవకాశం లేకపోయింది.

స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో బయటపడినవారిలో నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నారని సమాచారం.

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపమే కారణమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement